బీజేపీ, వైసీపీలపై మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్ పై విరుచుకుపడ్డ సోమిరెడ్డి
రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ అధినేత చంద్రబాబు నిత్యం శ్రమిస్తూ ఉంటారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ, వైసీపీలపై సంచలన ఆరోపణలు చేశారు.బీజేపీతో వైసీపీ నేతలు కుమ్మకయ్యారని ఆయన ఆరోపించారు. వీరిద్దరి లాలూచీ రాజకీయాలతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు.
కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తాము ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం జగన్ కిలేవన్నారు. అలాంటి జగన్ కి, ఆయన పార్టీ నేతలకు తమ అధినేత చంద్రబాబుని విమర్శించే హక్కు, మాట్లాడే అర్హతలేదన్నారు.
రాష్ట్రానికి హోదా సాధనలో తమ పార్టీ ఎంపీలు శాయశక్తులా ప్రయత్నించారన్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు తిరగబడే వరకు వైసీపీ ఎంపీలు ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు. అప్పటి వరకు వైసీపీ ఎంపీలు ఏం చేసినట్లు అంటూ ప్రశ్నించారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రతిపక్ష వైసీపీ పాకులాడుతోందని మండిపడ్డారు.