Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ప్రభుత్వానికి జనసేన వార్నింగ్, జనసైనికులకు నాదెండ్ల సూచన

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగష్టు 24న వైసీపీ సోషల్ మీడియాలో విభాగం సోషల్ మీడియాలో రాసిన కట్టుకథలపై జనసేన పార్టీ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 

janasena party political affairs committee chairman nadendla manohar fires on ysrcp government
Author
Amaravathi, First Published Oct 1, 2019, 10:43 AM IST

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శించినందుకు గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన వాసా శ్రీనివాసరావు అనే జనసేన పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. 
పోలీస్ శాఖపై జనసేన పార్టీకి, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. 

దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు వాక్ స్వతంత్రాన్ని హరించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన రాజకీయ విమర్శల ఆధారంగా ఎవరినీ అరెస్ట్ చేయరాదని స్వయంగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సైతం మంగళగిరి పోలీసులు కాలరాశారని ఆరోపించారు. 

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక రాజకీయ విమర్శపై ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం సరికాదని హితవు పలికారు. 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగష్టు 24న వైసీపీ సోషల్ మీడియాలో విభాగం సోషల్ మీడియాలో రాసిన కట్టుకథలపై జనసేన పార్టీ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 

కానీ శ్రీనివాసరావును వెంటనే అరెస్ట్ చేస్తారని దాన్ని బట్టి పోలీసుల తీరు ఎలా ఉందో ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అరెస్టులు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

లేనిపక్షంలో ప్రజాస్వామ్యయుతంగా పోలీస్ స్టేషన్ల వద్ద నిరసన తెలియజేస్తామని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలను సున్నితంగా మందలించారు నాదెండ్ల మనోహర్. విమర్శలు చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనసైనికులకు నాదెండ్ల మనోహర్ సూచించారు.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios