నన్ను నేను ఎలా రక్షించుకోవాలో తెలుసు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ తనపై నిఘా పెట్టిందని ఆరోపించారు. తానేమైనా ఉగ్రవాదినా? లేక సంఘ విద్రోహ శక్తినా? అని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ తనపై నిఘా పెట్టిందని ఆరోపించారు. తానేమైనా ఉగ్రవాదినా? లేక సంఘ విద్రోహ శక్తినా? అని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గతంలో తనకు నలుగురు గన్మెన్లను ఇచ్చి వారితోనే నిఘా పెట్టారని గుర్తు చేశారు. అందువల్లే ఆ నలుగురు గన్ మెన్ లను వెనక్కి పంపానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తనకు భద్రత కల్పిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారని అయితే తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలుసునని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కుల రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని విజ్ఞానవంతులు, మేధావులు రాజకీయాలను శాసించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తాను దీర్ఘకాలిక ప్రణాళికతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనసేన నేతలు, కార్యకర్తలపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను టీడీపీ నేతలు దోచుకుని పదిరెట్లు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని పవన్ ఆరోపించారు.