జగన్ కు ఊరట..నెలకొకసారి వస్తే చాలన్న కోర్టు
- వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధనకు సిబిఐ కోర్టు కు సానుకూలంగా స్పందించింది
- పాదయాత్ర చేయటానికి వీలుగా కేసుల్లో విచారణ నుండి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోర్టును అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టులో పెద్ద ఊరటే లభించింది. పాదయాత్ర చేయటానికి వీలుగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కావాలంటూ జగన్ పిటీషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా జగన్ ప్రస్తుతం ప్రతీ శుక్రవారం కోర్టుకు వచ్చి వ్యక్తిగత హాజరు వేసుకుంటున్నారు. అటువంటిది పాదయాత్రను దృష్టిలో పెట్టుకున్న కోర్టు నెలకొకసారి కోర్టుకు వస్తే చాలని తాజాగా మినహాయింపిచ్చింది. దాంతో జగన్ కు పెద్ద రిలీఫ్ లభించినట్లే.
నవంబవర్ 2వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెడుతున్న నేపధ్యంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ ఓ పిటీషన్ వేసారు. అయితే, గతంలోనే కోర్టు అభ్యర్ధనను తోసిపుచ్చింది. అయితే, మళ్ళీ వేరే సెక్షన్ల క్రింద జగన్ మరో పిటీషన్ వేసారు. దాదపు నాలుగు వాయిదాల తర్వాత సోమవారం జగన్ పిటీషన్ ను విచారించింది. రాజకీయ కారణాలతో కోర్టు నుండి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటం సాధ్యం కాదని సిబిఐ న్యాయవాది వాదించారు. అయితే, వారానికి ఒకసారి కాకుండా నెలకొకసారి వస్తే చాలని మినహాయింపునిచ్చింది.