నెల్లూరులో బీజేపీ, టీడీపీల మధ్య ఘర్షణ
పలువురికి తీవ్ర గాయాలు
నెల్లూరు..ప్రధాని నరేంద్రమోదీ పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నిన్నటి వరకు మాటల యుద్ధాలు మాత్రమే చేసుకోగా..బాలకృష్ణ వ్యాఖ్యల కారణంగా భౌతిక దాడులకు కూడా దిగారు. బాలకృష్ణ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ..నెల్లూరు జిల్లాలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కాగా.. ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నెల్లూరులోని గాంధీ బొమ్మ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బాలకృష్ణకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళన చేశారు. పోటాపోటీగా మోదీకి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేపట్టింది. దీంతో నెల్లూరు రణరంగంగా మారింది. ఆందోళనలు శృతి మించడంతో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే పోలీసులు రెండు వర్గాలను శాంతింపజేసి ఉద్రిక్త పరిస్థితి గాడిలో పెట్టారు. పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
అంతే కాకుండా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను ఏపీ బీజేపీ నేతలు శనివారం ఉదయం కలుసుకున్నారు. నిన్న సీఎం చంద్రబాబు చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... గవర్నర్కు ఫిర్యాదు చేశారు. నరసింహన్ను కలిసినవారిలో విష్ణుకుమార్రాజు, మధవ్ తదితరులు ఉన్నారు.