బోటు వెలికితీత పనులు షురూ చేసిన ధర్మాడి సత్యం బృందం
గోదావరి నదిలో మునిగిన బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
దేవీపట్నం:తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు మంగళవవారం నాడు ధర్మాడిసత్యం బృందం ప్రయత్నాలు ప్రారంభించింది. బోటు వెలికితీసేందుకు జిల్లా కలెక్టర్ సోమవారం నాడు ధర్మాడి సత్యం బృందానికి అనుమతి ఇచ్చారు.
గత నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో పాపికొండలు వెళ్తున్నరాయల్ వశిష్ట బోటు మునిగిపోయింది.
ఈ బోటులో ప్రయాణీస్తున్న 38 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 13 మృతదేహాలు ఇంకా వెలికితీయాల్సి ఉంది. ఈ ప్రమాదం నుండి సుమారు 26 మంది సురక్షితంగా బయటపడ్డారు.
ఈ బోటును వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు చేశాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ధర్మాడి సత్యం బృందానికి రూ. 22 లక్షలకు టెండర్ ను ఇచ్చింది.
గత నెల చివరి వారంలో మూడు రోజుల పాటు ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలో బోటు వెలికితీసేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో వరద తగ్గే వరకు బోటు వెలికితీసే పనులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టింది.దీంతో ఈ నది నుండి బోటును వెలికితీసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి మేరకు బోటు వెలికితీసే ప్రయత్నాలను ప్రారంభించారు.
రాయల్ వశిష్ట బోటులో ప్రయాణం చేసి ఆచూకీ లేకుండా పోయిన వారు మృతి చెందినట్టుగానే డెత్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని కూడ ఏర్పాటు చేసింది.