నన్ను అడ్డుకున్నారు. ఎపి జగన్ జాగీరు కాదు: చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.
గుంటూరు: రాష్ట్రం జగన్, వైసీపీ జాగీరు కాదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి కనీసం చట్టాన్ని కూడ గౌరవించరన్నారు.
బుధవారం నాడు గుంటూరు పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని వైసీపీ రావణ కాష్టంగా మారుస్తోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
తనను పల్నాడులో పర్యటించకుండా అడ్డుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. తనను పల్నాడుకు రాకుండా అడ్డుకోవడం మీ వల్ల కాదని చంద్రబాబు చెప్పారు. గురువారం నాడు మాచర్ల బాధితులతో కలిసి డీజీపీని కలవనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.గాంధీ స్పూర్తితో అహింసాయుతంగానే తాను పోరాటం చేస్తానని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.