జగన్ కేసుతో లింక్: హైకోర్టు విభజనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు విభజన ఉద్యోగులకు రాష్ట్ర విభజన వంటి షాక్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనకు కొంత సమయం ఇచ్చి ఉంటే ఉద్యోగులకు ఇబ్బంది ఉండేది కాదని ఆయన అన్నారు.
అమరావతి: హైకోర్టు విభజనను గురువారంనాడు స్వాగతించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజనను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు ముడిపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు విభజనకు జగన్ కేసుకు లింక్ ఉందని ఆయన అన్నారు. హైకోర్టు విభజన జరిగితే సిబిఐ కోర్టు విభజన కూడా జరగాలని, సిబిఐ కోర్టు విభజన జరిగితే ట్రయల్స్ పూర్తయిన జగన్ కేసులు మళ్లీ మొదటికి వస్తాయని ఆయన అన్నారు. జగన్ కేసుల విషయంలో అనుమానాలున్నాయని ఆయన అన్నారు.
హైకోర్టు విభజన ఉద్యోగులకు రాష్ట్ర విభజన వంటి షాక్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనకు కొంత సమయం ఇచ్చి ఉంటే ఉద్యోగులకు ఇబ్బంది ఉండేది కాదని ఆయన అన్నారు.
జనాభా వృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తుందని ఆయన చెప్పారు. ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. సామాజిక సమతుల్యతను సాధించాలంటే పెళ్లిళ్లు చేసుకోవాలని అన్నారు.
పదేళ్లలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని, ఏపీలో జనాభా పెరాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం మానవవనరుల అభివృద్ధిపై సీఎం ఆరో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానంపై నిబంధనను తొలగిస్తామని చంద్రబాబు తెలిపారు.