Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో కలకలం: వ్యాపారిని కాల్చి చంపిన దుండగులు

శనివారం రాత్రి 10 గంటలకు దుకాణం మూస్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై ముసుగులు ధరించి దుకాణం వద్దకు వచ్చారు. వెంట తెచ్చుకున్న గన్‌తో వ్యాపారి మహేంద్రసింగ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. 

Businessman shot dead at Nellore
Author
Nellore, First Published Nov 4, 2018, 7:15 AM IST

నెల్లూరు: ఓ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన నెల్లూరులో కలకలం సృష్టించింది. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యాపారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ సంఘటనతో పోలీసులు నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. శనివారం రాత్రి 10 గంటలకు దుకాణం మూస్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై ముసుగులు ధరించి దుకాణం వద్దకు వచ్చారు. వెంట తెచ్చుకున్న గన్‌తో వ్యాపారి మహేంద్రసింగ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. 

తుపాకి పేలిన శబ్ధం విని అందరూ ఉలిక్కిపడి ఏం జరిగిందోనని సంఘటనా స్థలానికి పరుగెత్తుతూ వచ్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మహేంద్రసింగ్‌ దుకాణం వద్దే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఛాతి, కడుపులోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో రక్తస్రావం ఆగక అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. 

ఏఎస్పీ పి. పరమేశ్వరరెడ్డి, డీఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడే ఉన్న అల్లాభక్షు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నబజారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన కె. మహేంద్రసింగ్‌(40), ఉష దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పదేళ్ల క్రితం మహేంద్రసింగ్‌ కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. 

ఫత్తేఖాన్‌పేటలో నివాసం ఉంటూ తొలుత మార్బుల్‌ పనులు చేసుకొంటూ జీవనం సాగించేవాడు. ఏడేళ్ల కిందట ఫత్తేఖాన్‌పేట రైతుబజారు ఎదురు దుకాణాల్లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని కోమల్‌ పవర్‌ టూర్స్‌ పేరిట మార్బుల్స్‌ పరికరాల విక్రయ దుకాణం ప్రారంభించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios