గంటా పాము, లోకేష్! జాగ్రత్త: అవంతి సంచనల వ్యాఖ్యలు
గంటా అసలు స్వరూపం మీకు తెలియదని మంత్రి అయ్యన్న పాత్రుడుని అడిగితే చెప్తారని చెప్పుకొచ్చారు. గంటా అనే పాముని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నమ్మించి మోసం చెయ్యడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని విమర్శించారు.
విశాఖపట్నం: ఏపీ మంత్రి నారా లోకేష్ కు వైసీపీ నేత, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ హితబోధ చేశారు. మంత్రి లోకేష్ గారూ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును నమ్మెుద్దు అని హితవు పలికారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి విశాఖపట్నం చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా టార్గెట్ భీమిలి సీటు కాదని అమరావతిలోని సీఎం కుర్చీ అంటూ చెప్పుకొచ్చారు.
గంటా అసలు స్వరూపం మీకు తెలియదని మంత్రి అయ్యన్న పాత్రుడుని అడిగితే చెప్తారని చెప్పుకొచ్చారు. గంటా అనే పాముని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నమ్మించి మోసం చెయ్యడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని విమర్శించారు.
డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనుకునే వ్యక్తి గంటా అంటూ విమర్శించారు. విశాఖపట్నం జిల్లా మంత్రిగా ఉన్న ఆయన ఒక్కరోజు కూడా సమన్వయ కమిటీ సమావేశాలకు హాజరుకాలేదని అలాంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తారా అంటూ కౌంటర్ ఇచ్చారు.
తనపై పోటీ చేసే వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తనదని గంటాలా స్వార్థపూరితమైన వ్యక్తిని కాదన్నారు. గంటాను నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన చింతలపూడి వెంకట రామయ్య, కన్నబాబుకు టికెట్ లేకుండా చేశారని గుర్తు చేశారు.
భీమిలి నియోజకవర్గ ప్రజలను గంటా శ్రీనివాస్ హీనంగా చూస్తున్నారని ఆరోపించారు. తానంతట తాను టీడీపీలోకి వెళ్లలేదని వాళ్లు పిలిస్తేనే వెళ్లానని అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తనకు రెండు లక్షల మంది విద్యార్థుల శక్తి ఉందని నైతిక విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తానే తప్ప వక్రమార్గాలు అనసరించనన్నారు ఎంపీ అవంతి శ్రీనివాస్.