Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగి ఉండాలంటే మెుత్తం సీట్లలో 10శాతం సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఆవిధంగా చూస్తే టీడీపీ 18 సీట్లు సాధించాలి. లక్కీ కొద్ది చంద్రబాబు నాయుడు 23 సీట్లు గెలుచుకున్నారు. ఒకవేళ ఆరుగురు ఎమ్మెల్యేలు గోడదూకితే చంద్రబాబుకు ప్రతిపక్ష పదవి గల్లంతే. 

ap politics: 10 Tdp mlas are touch with ysrcp, they likely join ysrcp
Author
Amaravathi, First Published Oct 26, 2019, 3:24 PM IST

అమరావతి: రాజకీయాల్లో సీనియర్ అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బతగులుతుందా....? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఇయర్స్ చీఫ్ మినిస్టర్ అంటూ ఇప్పటి వరకు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు గట్టి దెబ్బ తగలనుందా.....?

రాజకీయాల్లో ప్రధాని నరేంద్రమోదీ కంటే సీనియర్ అంటూ ఎన్నికల ప్రచారంలో మైకుల ముందు ఊదరగొట్టిన చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బతీసేందుకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారా...? లేక తెలుగుతమ్ముళ్లే షాక్ ఇస్తున్నారా...? అంటే రెండోదే సరైన సమాధానం అంటూ ప్రచారం జరుగుతుంది. 

కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు చంద్రబాబు నాయుడుకు దూరం అయ్యేందుకు ఆయన వ్యవహారశైలి ఒకటి కారణం అయితే, భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా తెలుగు తమ్ముళ్లు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ పదవీబాధ్యతలు చేపట్టి దాదాపుగా ఐదు నెలలు కావస్తోంది. కనీసం కొత్తప్రభుత్వాలకు ఆరు నెలలు సమయం ఇవ్వడం రాజకీయాల్లో సహజంగా చెప్పుకొవచ్చు. అధికార పార్టీలో అంతర్గత కలహాలైతే చెప్పలేం గానీ ప్రతిపక్ష పార్టీలు అయితే కాస్త టైం ఇచ్చి ఆ తర్వాత పోరాటానికి దిగుతుంది. 

కానీ ఏపీలో చంద్రబాబు నాయుడు అలా చేయడం లేదు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా కాస్త అభ్యంతరకర విమర్శలు చేస్తున్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. 

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇకపోతే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిస్థితి అయితే మరీ దయనీయం. 

ఈ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా తమ రాజకీయ భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని కొందరు తెలుగు తమ్ముళ్లు వ్యూహరచన చేస్తున్నారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరితే కనీసం ఉనికిని అయినా కాపాడుకోవచ్చు అనే చర్చ నేతల్లో కనిపిస్తోందట. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను ఒకబూచిగా చూపించి దుకాణం సర్ధుకునేందుకు రెడీ అవుతున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇకపోతే వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరికకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కండీషన్స్ అప్లై చేస్తారా అన్నదానిపై కొందరు ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అంటే 151 సీట్లతో అఖండ విజయాన్ని సాధించి చరిత్ర తిరగరాసింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని సీఎం జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 

వైయస్ జగన్ అఖండ  మెజారిటీతో అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాయలసీమ ప్రాంతంతోపాటు ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.  

ఇంతలోనే సీఎం జగన్ వైసీపీలో చేరాలనుకునే వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలంటూ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలని సూచించారు. 

గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు తాము చేయబోమని క్లారిటీ ఇచ్చేశారట జగన్. వైసీపీ ఎమ్మెల్యేలను పదవులకు రాజీనామా చేయించకుండా పార్టీలోకి చేర్చుకోవడమే కాకుండా కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై జగన్ ఆనాడు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసిందని పార్టీకి రాజీనామా చేయకుండా టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని జగన్ ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడమే జగన్ పాదయాత్రకు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. 

అప్పటికే ఎన్నికల్లో వ్యయప్రయాసలు ఒడ్డి ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నవారంతా తిరిగి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలంటే గెలుస్తామో లేదో అన్న సందేహంతో వెనకడుగు వేశారు. అయినప్పటికీ కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారట. 

ఇంతలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితుడు అయిన వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుండటంతో గోడదూకేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కాచుకు కూర్చున్నారట. 

శుక్రవారం సీఎం వైయస్ జగన్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భేటీలో ఏ అంశాలపై ప్రస్తావన వచ్చింది వల్లభనేని వంశీకి జగన్ ఎలాంటి షరతులుపెట్టారు అన్నదానిపై ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రమ్మంటే వచ్చిన తర్వాత అతనికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే దానిపై తెలుగుతమ్ముళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. 

ఒకవేళ వల్లభనేని వంశీమోహన్ తోపాటు మరో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే చంద్రబా నాయుడుకు ప్రతిపక్షనేత పదవి కూడా దక్కదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 

వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగి ఉండాలంటే మెుత్తం సీట్లలో 10శాతం సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఆవిధంగా చూస్తే టీడీపీ 18 సీట్లు సాధించాలి. లక్కీ కొద్ది చంద్రబాబు నాయుడు 23 సీట్లు గెలుచుకున్నారు. ఒకవేళ ఆరుగురు ఎమ్మెల్యేలు గోడదూకితే చంద్రబాబుకు ప్రతిపక్ష పదవి గల్లంతే. 

ఇప్పుడు వంశీతోపాటు పదిమంది ఎమ్మెల్యేలు అంటే మెుత్తం 11 మంది గనుక టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరితే ఇక చంద్రబాబు నాయుడు పని అంతేనని గుసుగుసలు వినిపిస్తున్నాయి. 

10 మంది కాకపోయినా కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు అయినా వైసీపీ గూటికి చేరినా చంద్రబాబు నాయుడుకు ముప్పుతప్పదంటూ ప్రచారం జరుగుతుంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ రాజకీయం అయితే చేశారో అదే రాజకీయం గనుక జగన్ చేసి ఉంటే ఇక చంద్రబాబు రాజకీయం మూలనపడినట్లేనని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది. 

ఇకపోతే దీపావళి తర్వాత ఏపీ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. సీఎం జగన్ కాస్త దూకుడుగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే తరుణంలో తెలుగుతమ్ముళ్లు సైతం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరే ఛాన్స్ కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే చంద్రబాబునాయుడుకు పెద్ద దెబ్బేనని తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ , భారతమ్మలపై కేసులు పెట్టారు... వల్లభనేని వంశీపై యార్లగడ్డ కామెంట్స్. 

వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డకు జగన్ హామీ ఇదే !...

Follow Us:
Download App:
  • android
  • ios