అంధకారంలో ఎపి: వైఎస్ జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. విద్యుత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. విద్యుత్తు కొరతను తీర్చలేని ప్రభుత్వం అంటూ వైఎస్ జగన్ పై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో 151 స్థానాలు గెలిచిన ప్రభుత్వం విద్యుత్తుకు గ్యారంటీ ఇవ్వలేపోతుందని పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. విద్యుత్తు ప్రంపంచంలోని అన్ని వ్యాధులను నయం చేస్తుందని థామస్ ఎడిషన్ వాక్యాన్ని ఆ ఫొటో జత చేసి ఉంటంకిస్తూ విద్యుత్తు లేకపోవడం వల్ల అన్ని వ్యాధులు నయమవుతాయని ఎపి ప్రభుత్వం భావిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
"ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది" అని పవన్ కల్యాణ్ అన్నారు..
"ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?" అని మరో ట్వీట్ లో అన్నారు.
"2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారు" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
"ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు" అని విమర్శించారు.
"2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్. ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమే" అని పవన్ కల్యాణ్ లెక్కలు చెప్పారు.
"ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు,పెట్టుబడుల మీద ఒప్పందాలు.కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు , పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్ల ని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం..." అంటూ ధ్వజమెత్తారు.
"మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది?" అని పవన్ కల్యామఅ ప్రశ్నించారు.