ఈనెల 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్: ప్రధాని మోదీతో కీలక భేటి
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, పీపీఏలు, కేంద్రం నుంచి విడుదల కావాల్సిన బకాయిలపై కూడా సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తినబాట పట్టనున్నారు. ఈనెల 5న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నట్లు సీఎంవో కార్యాలయం స్పష్టం చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని కోరనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
అలాగే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, పీపీఏలు, కేంద్రం నుంచి విడుదల కావాల్సిన బకాయిలపై కూడా సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈనెల 3న తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రెండు రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.