దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం: జగన్ పై చంద్రబాబు ఫైర్
గుంటూరు జిల్లా తెనాలిలో అబ్దుల్ రజాక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైెఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిందించారు. ఏపీని ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు.
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో అబ్దుల్ రజాక్ అనే మైనారిటీ వర్గానికి చెందిన యువకుడు, పైగా దివ్యాంగుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
వైసీపీ నేతల వేధింపులు భరించలేక అబ్దుల్ రజాక్ ఆత్మహత్యా యత్నం చేశాడని ఆయన విమర్శించారు. ఉన్నవాళ్ళను ఉన్నట్టుండి ఉద్యోగంలోంచి తీసేసే కొత్త సంప్రదాయం ఆయన అడిగారు.
వైసీపీ కార్యకర్తల ఉపాధి కోసం, ఉన్నవాళ్లను ఉద్యోగాల్లోనుంచి తీసేస్తారా ? గతంలో ఎప్పుడైనా ఉందా ఈ దుష్ట విధానం? రాష్ట్రచరిత్రలో ఇన్ని ఆత్మహత్యయత్నాలు ఎప్పుడైనా చూసామా అని చంద్రబాబు ప్రశ్నించారు.
కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం చేతకాని మీకు, ఉన్నవాళ్ళను తొలగించే హక్కు ఎక్కడిదని ఆయన అడిగారు. పెట్టుబడులు పెట్టేవాళ్లను బెదిరించి తరిమేశారని ఆయన విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన పడకేశాయని, ఉద్యోగులను బెదిరించి ఆత్మహత్యల పాల్జేశారని ఆయన ప్రబుత్వంపై మండిపడ్డారు.
అయిదు నెలల్లోనే వైసీపీ నేతలు, రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్ గా మార్చి అప్రదిష్ట తెచ్చారని ఆయన అన్నారు. రజాక్ ఆత్మహత్యా యత్నానికి కారణమైన వాళ్ళమీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.